న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం పట్ల ఆవేదన చెందారు. విద్యార్థుల నిరసనలను ప్రభుత్వం చాలా అధ్వాన్నంగా నిర్వహించిందని, బలప్రయోగానికి బదులుగా అసంతృప్తితో ఉన్న యువతతో చర్చలు జరిపి ఉండాల్సిందని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. నిరసనకారులైన విద్యార్థులపై పోలీసుల చర్యను విమర్శించారు. లాఠీఛార్జ్ దిగ్భ్రాంతికరమని పేర్కొంటూ, వారి సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జ్ విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడిన థరూర్, విద్యార్థులపై జరిగిన దాడి దిగ్భ్రాంతికరమని, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఖండించారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసన స్థలాన్ని సందర్శించి, ‘సంసద్ చలో’ లో గాయపడిన పలువురు విద్యార్థులతో మాట్లాడారు శశి థరూర్. వారి బాధాకరమైన అనుభవాలను విని కలత చెందానని చెప్పారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావంగా నల్లని దుస్తులు ధరించారు. ఇది దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఉన్న విచారాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని బీజేపీ చేసిన ఆరోపణపై స్పందిస్తూ, పార్లమెంటులో ఒక సమస్యను లేవనెత్తలేని పరిస్థితి ఏర్పడినప్పుడే రాజకీయాలు ప్రవేశిస్తాయని ఆయన అన్నారు.కానీ అసలు విషయం విద్యార్థుల మనోభావాలు. వారే దేశ భవిష్యత్తు. వారు మోస పోయామని భావిస్తుంటే, వారిని సంప్రదించడానికి లేదా వారి సమస్యలను వినడానికి ఏదో ఒక అవకాశం ఉండాలన్నారు ఎంపీ.
పోలీసు చర్యల వెనుక ప్రభుత్వం తన జవాబుదారీతనం లేనితనాన్ని దాచలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని బలవంతంగా ఈడ్చుకెళ్లి, ఇతర ఎంపీలతో పాటు నిర్బంధంలోకి తీసుకోవడం అనేది మన దేశంలోని ప్రతి ఒక్కరి హృదయాలను, మనస్సాక్షిని కదిలించిన విషయం అని జంతర్ మంతర్ వద్ద అన్నారు. ఇక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలపాలని నేను భావించాను, అందుకే వారిని చూడటానికి వచ్చాను. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్య హక్కు అని నేను భావిస్తున్నాను. ఇది అహింసాత్మక నిరసన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయడానికి ప్రయత్నించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇంతటి అసంవేదనతో వ్యవహరిస్తోందో నాకు అర్థం కావడం లేదు అని తిరువనంతపురం ఎంపీ అన్నారు.
