శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

గరుడసేవ రోజు భక్తుల రద్దీ, రాకపోకలపై ప్రత్యేక ప్రణాళిక

తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాల‌ను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ , బందోబస్తు ఏర్పాట్లను ముందస్తుగా పటిష్టం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశించారు. ఈ మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమల డీఎస్పీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, తిరుమల 2 టౌన్ సీఐ, AVSO తదితర అధికారులు విజిలెన్స్ సిబ్బందితో కలిసి తిరుమలలోని కీలక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గరుడసేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు, అవసరమైన సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తరలించే విధంగా నిష్క్రమణ ప్రణాళికపై ప్రధానంగా చర్చించారు.

ఇందులో భాగంగా లేపాక్షి సర్కిల్, SV షాపింగ్ కాంప్లెక్స్, SMC, సుపథం, రాగిమాను జంక్షన్ ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, రాకపోకల నిర్వహణ, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు, అవసరమైన భద్రతా చర్యలపై పోలీసు–విజిలెన్స్ అధికారులతో మరోసారి సంయుక్త సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో అన్ని సంబంధిత విభాగాల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు మరియు అత్యవసర పరిస్థితుల నిర్వహణపై సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your Email Id will not be published!