హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైదరాబాద్ లోని సల్కం చెరువు ఆక్రమణ విషయంపై. ఈ సందర్బంగా ఉన్నతాధికారులకు హైకోర్టు ధిక్కార నోటీసులు ఆరీ చేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్థాపించిన ‘సలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ద్వారా బండ్లగూడలోని సల్కం చెరువు అక్రమ నిర్మాణాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు దాచారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సీనియర్ అధికారులకు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్, ప్రధాన కార్యదర్శులు యోగితా రాణా , ఈ. శ్రీధర్ (నీటిపారుదల), లోకేష్ కుమార్ (రెవెన్యూ)లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కూడా ఒక ప్రతివాదిగా చేర్చడానికి పిటిషనర్, న్యాయవాది విజయ్ గోపాల్కు కోర్టు అనుమతినిచ్చింది .
ఈ కేసును తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది హైకోర్టు. ఏప్రిల్ 30న కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ,విద్యాసంస్థలకు మంజూరు చేసిన అనుమతులు, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర విచారణ నివేదికలను అధికారులు సమర్పించలేదని పిటిషనర్ విజయ్ గోపాల్ ఫిర్యాదు చేశారు. చెరువుకు సంబంధించిన వాస్తవాలను , గతంలో న్యాయస్థానాలు వెల్లడించిన అంశాలను దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన వారి ప్రకారం, సర్వే నంబర్ 62లోని మొత్తం భూమిని చెరువు భూమిగా గతంలోనే న్యాయస్థానాలు నిర్ధారించిన విషయం తెలిసినప్పటికీ, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు జూలై 9న జరిగిన విచారణలో చెరువు యొక్క ‘ఫుల్ ట్యాంక్ లెవల్’ ను మారుస్తూ రూపొందించిన ఒక మెమోను సమర్పించి హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
