ఇందిరమ్మ హౌసెస్ టవర్స్ కు భారీ స్పందన

7,340 ఇళ్ల కోసం 35,125 దరఖాస్తులు

హైద‌రాబాద్ : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లను కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ నగర పరిధిలో ‘ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’ పథకం కింద నిర్మించనున్న ఫ్లాట్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేపట్టారు. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం ‘డిమాండ్ సర్వే’ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇళ్ల కోసం 35,125 దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించ వచ్చని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ తెలిపారు.

తక్కువ ఆదాయ వర్గాల వారికి సొంత ఇల్లు సమకూర్చు కోవడం ఒక సవాలుతో కూడిన పనిగా పరిగణించ బడుతుంది; వారికి చాలా తక్కువ ధరకే ఇళ్లను అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అంతే కాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి పథకాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. ప్రతి నియోజకవర్గంలోనూ అత్యంత విలువైన భూములలో నిర్మిస్తున్న ఈ ఇళ్లను నామమాత్రపు ధరకే అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో 30 నుండి 58 లక్షల రూపాయల విలువ చేసే ఈ ఫ్లాట్లను, ప్రజల సంక్షేమం , జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంతో ప్రభుత్వం కేవలం 6 లక్షల రూపాయలకే కేటాయిస్తోందని ఆయన తెలిపారు.

అదనంగా ఇళ్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేపడతామని ఆయన వివరించారు. ఈ పథకం ద్వారా, ప్రజలు ఇల్లు సొంతం చేసుకోవడం కోసం తాము నివసిస్తున్న ప్రాంతాల నుండి వలస వెళ్లాల్సిన లేదా వేరే చోటికి మారాల్సిన అవసరం లేకుండా, ప్రస్తుతం ఉంటున్న నియోజకవర్గంలోనే సొంత ఇంటిని పొందే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎటువంటి కుల లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఇళ్లు కేటాయించ బడకపోతే, దరఖాస్తుదారులు చెల్లించిన రూ. 10,000 (పది వేల రూపాయల) దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!