కాంగ్రెస్ స్కామ్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
సంచలన ఆరోపణలు చేసిన భారత రాష్ట్ర సమతి పార్టీ
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానంకు ఫిర్యాదు చేసింది. పక్కా ఆధారాలతో లేఖను విడుదల చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జీ విచారణ లేదా హౌస్ కమిటీ వేయాలని కోరింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొందని ఆరోపించింది. లెక్కకు మించిన కుంభకోణాలు వరుసగా బయట పడుతుండటం మాత్రమే కాకుండా, స్వయంగా మంత్రులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసిన ఘనత మీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేసింది.
దాదాపు అన్ని శాఖలలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం యదేచ్చగా సాగుతుండగా, వాటిని అడ్డుకునే బాధ్యత వహించాల్సినవారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు, అవమానం కూడా అని హెచ్చరించింది. ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లి పోతుండగా, సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది బీఆర్ఎస్. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయని ఆరోపించింది.
మాటల్లో నీతి వాక్యాలు..చేతల్లో దోపిడీ.. ఇదే మీ పాలనకు ప్రతీకగా మారిందని ఎద్దేవా చేసింది.. అవినీతిని అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం అయ్యింది. ఈ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే, ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోందని పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతాం అని శాసన సభలో స్వయంగా మీరే ప్రకటించారు. కాబట్టి మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. మీ మాటపై మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.
