అమరావతి : అభివృద్ధి సహా వివిధ రంగాల్లో బెంచ్ మార్క్ సెట్ చేసేలా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి గ్రామస్థాయి ఉద్యోగులను కూడా మోటివేట్ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లే తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. గత పాలకుల నుంచి రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి. 94 కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రూ.10 వేల కోట్లను గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది. రూ.1.30 లక్షల కోట్ల బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారు. గత పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైంది. అందరి సహకారంతో అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి… వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం.
ప్రజా ప్రతినిధులు-అధికారుల కలయికే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నాం. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన చోట ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి. వచ్చిన ఫిర్యాదులు వంద శాతం పరిష్కారం కావాల్సిందే. ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా.. కొందరు పైకి కిందకు ఫైళ్లు తిప్పుతున్నారు… వాటిని తక్షణం పరిష్కరించాలి. ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి.
