జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి

స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల

అమ‌రావ‌తి :తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు చాలా కీలకం. మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలోనే రోల్ మోడల్ గా నిలవాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌. దీనికోసం అటవీ శాఖ సిబ్బంది సమష్టిగా పని చేస్తూ ముందుకు కదలాల‌ని అన్నారు. 1052 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత రక్షణకు మడ అడవులు బలమైన గోడల్లాంటివి అని చెప్పారు. వీటిని పెంపొందించడంలో, రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో “మడ అడవుల పెంపుదల – వాటి నుంచి సుస్థిర ఆదాయం ” జాతీయ స్థాయి వర్క్ షాపు విజయవాడలో ప్రారంభం అయ్యింది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

రాష్ట్రానికి తుపానుల ప్రభావం చాలా అధికం. దీనివల్ల ప్రతి ఏటా అపార నష్టం జరుగుతుందని అన్నారు డిప్యూటీ సీఎం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో తుపానుల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి మడ అడవులను సమృద్ధిగా పెంచడం అనేది కీలకం అన్నారు. మడ అడవుల పెంపకంలో జీవ వైవిధ్యాన్ని రక్షించాలని కోరారు ప‌వ‌న్ క‌ల్యాణ్. మడ అడవులను కొత్తగా పెంచడంతో పాటు, ఉన్న మడ అడవులను కాపాడు కోవడం అనేది ముఖ్య‌మ‌న్నారు. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతంలో సుమారుగా 700 హెక్టార్లలో మడ అడవులను పెంచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోను కొనసాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

Leave A Reply

Your Email Id will not be published!