Civil Services Results: ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి ! అయినా ‘సివిల్స్‌’లో రెండో ర్యాంకు !

ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి ! అయినా ‘సివిల్స్‌’లో రెండో ర్యాంకు !

Civil Services Results: తొమ్మిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు… సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలో క్యాన్సర్‌ తో పోరాడుతూ తల్లి ప్రాణాలు కోల్పోయింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి… లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాడు ఒడిశాకు చెందిన 24 ఏళ్ళ అనిమేశ్ ప్రధాన్. తాజాగా ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షా ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. ఒడిశాలోని అనుగుల్‌ జిల్లాలోని తాల్‌ చేర్‌ కు చెందిన అనిమేశ్‌… కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు. రూర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సివిల్స్ పై మక్కువతో మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే దేశంలోనే రెండో ర్యాంక్ సాధించాడు.

Civil Services Results..

ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అనిమేశ్ మాట్లాడుతూ… ‘‘2022లో సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించా. సోషియాలజీని ఆప్షనల్‌ గా ఎంచుకున్నా. రోజుకు 5- 6 గంటల పాటు చదివా. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సివిల్స్‌ ఫలితం విషయంలో చాలా సంతృప్తిగా ఉంది. నా కల నెరవేరింది. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గత నెలలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మా అమ్మను కోల్పోయాను. 2015లో నాన్న మృతి చెందారు. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. వారు లేని లోటు పూడ్చలేనిది’’ అని అనిమేశ్ అన్నారు.

ఐఏఎస్‌ కు తొలి ప్రాధాన్యం ఇచ్చానని… ఒడిశా(Odisha) క్యాడర్‌ ఆశిస్తున్నట్లు అనిమేశ్‌ చెప్పారు. ‘‘నా రాష్ట్ర ప్రజలు… ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతి కోసం పని చేయాలనుకుంటున్నా’’ అని వివరించారు. పార్లమెంటరీ డిబేటింగ్, మీడియా అడ్వకసీ- జర్నలిజం, ఫ్రీ-స్టైల్ డ్యాన్స్ అతని హాబీలు.

Also Read:K Annamalai : తమిళనాట పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ఫార్ములా ఫలించేనా..!

Leave A Reply

Your Email Id will not be published!