పాలమూరు జిల్లా : జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సినీ రంగంతో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలకు కోలుకోలేని ఝలక్ ఇచ్చారు. తాజాగా సినీ రంగంలోనే అత్యధికంగా డ్రగ్స్ తీసుకునే వారు ఉన్నారని, ముందు వాళ్లు అంతా టెస్టులు చేయించు కోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ సందర్బంగా తనను ఉద్దేశించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. తాము టెస్టులు చేయించుకునే సినిమాలు చేస్తామన్నారు. మీరు కూడా చేయించు కోవాలని సవాల్ విసిరారు.
దీనికి ఇవాళ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పందించారు. మంచు విష్ణుకు అంత సీన్ లేదన్నారు. తాను ఏం మాట్లాడానో దానికి విరుద్దంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరూ మౌనంగా లేరన్న విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తన తండ్రి మోహన్ బాబు ఏ టెస్ట్లు చేయించుకొని రాజ్యసభ సభ్యుడు అయ్యాడో ప్రజలకు చెప్పాలన్నారు. మంచు విష్ణు వ్యాఖ్యలకు కాంగ్రెస్ అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ సోదరుడు మనోజ్ టెస్ట్లే మీరు చేయించ లేదన్నారు, మాపై ఆరోపణలు చేస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఒక ఎమ్మెల్యేగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని రిపోర్టులు చూపిస్తాను, మీరు కూడా అదే విధంగా చేయాలని డిమాండ్ చేశారు అనిరుధ్ రెడ్డి.
