BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా
BC Reservation Bill: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
BC Reservation Bill Updates
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ హైకోర్టులో (TG High Court) పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు (BC Reservation Bill) అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదన్నారు. ‘‘42శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కుల గణన చేశారు.. కానీ బహిర్గతం చేయలేదు. బీసీ కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు. ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు (BC Reservation Bill) ఎలా?2018లో 34శాతం బీసీ రిజర్వేషన్లు ఇదే కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు?’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation Bill) అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చు.
శాసనవ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. నెలలపాటు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు. తమిళనాడులో ఒక బిల్లు ఏళ్లతరబడి గవర్నర్ వద్దే ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైన సభలు చేసే చట్టాలను ఆమోదించకపోతే ఎలా? ఆర్టికల్ 200ను గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు. వారు నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యవస్థ స్తంభించిపోతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి.
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయి. (ఈమేరకు ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన నోటిఫికేషన్ను కోర్టుకు అందజేశారు) ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తాం’’ అని సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారం మధ్యాహ్నానానికి వాయిదా వేసింది.
Also Read : Tejashwi Yadav: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ ?
