సర్కారు భూములను ప్రైవేట్ భూములుగా మార్చిన బీఆర్ఎస్
సంచలన ఆరోపణలు చేసిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శాసన సభ సాక్షిగా. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా బీఆర్ఎస్ మార్చిందని, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. నిషేధిత ’22-A’ జాబితా నుండి ప్రభుత్వ భూములను తొలగించడం లేదా ఆంక్షలు, కోర్టు విచారణలు , గతంలో జారీ చేసిన భూమి స్వాధీన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్ భూములుగా మార్చడం వంటి చర్యలను ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ పోర్టల్ ద్వారా హైదరాబాద్ , పొరుగు జిల్లాల్లోని విలువైన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, ఇనాం , రక్షణ శాఖ భూములను ప్రైవేట్ లేదా పట్టా భూములుగా మార్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందు ఆధారాలను సమర్పించారు. ప్రభుత్వ ఆరోపణలను ధృవీకరించడానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక ఉదాహరణలను ప్రస్తావించారు. సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్ రావు మామ మాధవరం హనుమంత రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, ఇతరులు ఇటువంటి అక్రమ భూ బదిలీల ద్వారా లబ్ధి పొందారని ఆరోపించారు. నిషేధిత ’22-A’ జాబితా నుండి ప్రభుత్వ భూములను తొలగించడం లేదా ఆంక్షలు, కోర్టు విచారణలు , గతంలో జారీ చేసిన భూమి స్వాధీన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్ భూములుగా మార్చడం వంటి చర్యలను ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని సర్వే నంబర్ 271లో 327 ఎకరాల 9 గుంటల అసైన్డ్ ప్రభుత్వ భూమి ఉండేదన్నారు.
హరీష్ రావు మామ మాధవరం హనుమంత రావు 2010-11లో 6 ఎకరాల 18 గుంటల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో భూమి పొందిన శ్రీనివాసాచారి నుండి 2 ఎకరాల 10 గుంటలు (సర్వే నంబర్ 271/18), అలాగే మాజీ సైనికోద్యోగుల కోటాలో భూమి పొందిన పాసి సత్యనారాయణ నుండి 4 ఎకరాల 8 గుంటల (సర్వే నంబర్ 271/98) భూమిని ఆయన కొనుగోలు చేశారని తెలిపారు. ₹11.92 లక్షల పరిహారంతో 1 ఎకరం 26 గుంటల భూమిని సేకరించిన తర్వాత, మిగిలిన 4 ఎకరాల 32 గుంటల భూమిని అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2023 ఆగస్టు 1న ’22-A’ నిషేధిత జాబితా నుండి తొలగించి పట్టా భూమిగా మార్చారని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్లో 569 ఎకరాల 5 గుంటల ‘ఇనాం’ భూమి ఉండేదని, ఇందులో 372 ఎకరాల 32 గుంటల భూమికి సంబంధించి, భూమిపై వినియోగదారుని హక్కును ధృవీకరించే ‘ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్’ (ORC)ను 2023 ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు జారీ చేశారన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలోని సర్వే నంబర్లు 58 , 59 పరిధిలోని 112 ఎకరాల 21 గుంటల భూమిని 2020లో ‘సెక్షన్ 22-A’ నిషేధిత జాబితా నుండి తొలగించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు. అప్పటి అదనపు కలెక్టర్, ఆర్డీఓలను కూడా అరెస్టు చేశారని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నంబర్లు 186-189 పరిధిలో 29 ఎకరాల 27 గుంటల భూదాన్ భూమి ఉందన్నారు. హైకోర్టు ‘యథాతథ స్థితి’ ని కొనసాగించాలని ఆదేశించినప్పటికీ, రెవెన్యూ అధికారులు ఆ భూమికి ఉన్న ‘భూదాన్’ వర్గీకరణను తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతరుల ప్రమేయం ఉందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
