బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి లేని పోని కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బెంగళూరులో ఇవాళ డీకే మీడియాతో మాట్లాడారు. తమ సర్కార్ ప్రజా పాలన సాగిస్తోందని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు. కుమారస్వామి కంటే నాకు రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉందని అన్నారు డీకే శివకుమార్. నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఆయన కంటే నాకు పరిపాలనలో మెరుగైన అనుభవం ఉందని స్పష్టం చేశారు. నేను చాలా కాలం పాటు మంత్రిగా ఉన్నానని అన్నారు. పరిపాలన అంటే ఏమిటో, ఎలా పనిచేయాలో, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో నాకు బాగా తెలుసంటూ స్పష్టం చేశారు.
అయితే పదే పదే నోరు పారేసుకుంటున్న కుమార స్వామికి తాను చెప్పేది ఒక్కటేనని, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే తనకే మంచిది కాదని హితవు పలికారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తాను ఏమిటో, తన పనితీరు ఏమిటో ఇప్పటికే మీ పార్టీకి, ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ వారికి కూడా తెలుసన్నారు. ఇవాళ కాక పోయినా ఏదో ఒక రోజు కర్ణాటకకు ముఖ్యమంత్రి అయి తీరుతానంటూ ప్రకటించారు. అప్పటి వరకు కుమార స్వామి కాస్తాంత ఓపిక పట్టాలంటూ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా నేను పార్టీ కోసం పనిచేయాలి. గతంలో కూడా నేను అస్సాంకు వెళ్ళాను. నేను ఇప్పుడే ఏఐసీసీ పత్రికా ప్రకటన చూశాను, వారు నన్ను మళ్ళీ అస్సాంకు వెళ్లమని కోరుతున్నారు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పారు.
