DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు
సీఎం మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి కావాలని ఆశ పడటంలో తప్పు లేదన్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు బహిరంగంగా కోరినట్లు తెలుస్తోంది. దీనిపై డీకే మాట్లాడుతూ… ‘ఆశ పడటంలో తప్పేంటి?. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులుగా చేసే అవకాశం సీఎంకు ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ ఆశ ఉంటుంది. అది తప్పు అని ఎలా చెబుతాం?. వారిలో చాలామంది పార్టీ కోసం కష్టపడినవారు, త్యాగాలు చేసినవారు ఉన్నారు’ అని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. ఆ ప్రశ్న జ్యోతిషుడినే అడగాలని వ్యాఖ్యానించారు.
కర్ణాటక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలోనే వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ పైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఖర్గేతో డీకే ఆదివారమే సమావేశమై చర్చలు జరిపారు. ‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు సమావేశం కావడం సర్వసాధారణం. ఇందులో కొత్తేమీ లేదు. పార్టీకి సంబంధించిన అంశాలనే మాట్లాడుకున్నాం’ అని డీకే ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఒకవేళ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు అధిష్ఠానం ఆమోదం తెలిపితే… సిద్ధరామయ్య పూర్తికాలం సీఎంగా కొనసాగేందుకు అనుమతి లభించినట్లేనని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఢిల్లీలో ఎవరికి వారే
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. 40 నిమిషాలపాటు చర్చించారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ 3రోజులుగా ఢిల్లీలోనే ఉన్నా, సీఎం ఒంటరిగానే ప్రధానిని కలవడం గమనార్హం. డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి 3 గంటలకు బెంగళూరు బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాత్రి సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఢిల్లీలో మూడు రోజులు గడిపిన డీకే శివకుమార్, తన తమ్ముడు సురేశ్తో కలసి ఆదివారం ఖర్గేతో భేటీ అయ్యారు. కాగా, సీఎం సిద్దరామయ్య శనివారం మధ్యాహ్నం రాహుల్గాంధీని కలిసిన విషయం తెలిసిందే. అప్పటికే ఢిల్లీకి డీకే శివకుమార్ కూడా చేరుకున్నారు. అయినా రాహుల్గాంధీని, ఖర్గేని సీఎం ఒంటరిగానే కలిశారు. మొత్తంగా ముుఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మూడు రోజులుగా ఢిల్లీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు.
