శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ రితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20 శాతం మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, రవాణా, క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలనిసూచించారు.
శ్రీశైల పరిసర ప్రాంతాలను 11 జోన్లుగా విభజించి, ప్రతి జోన్ కకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగించేలా 24 గంటలు మూడు షిఫ్టులుగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డీపీఓను ఆదేశించారు.
