ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం..మంత్రి సంతాపం

హైద‌రాబాద్ : స్మ‌గ్ల‌ర్ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ క‌న్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు వెల్ల‌డించారు. ఆమె మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. ఇది జ‌ర‌గ కూడ‌ద‌ని పేర్కొన్నారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంటామ‌న్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది భద్రత కోసం వారికి ఆయుధాలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య జనవరి 23న తీవ్రంగా గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో స్మగ్లర్లు కావాలనే తమ వాహనంతో త‌న‌ను ఢీకొట్టారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న వ‌య‌సు 26 ఏళ్లు. వారి దాడి కార‌ణంగా త‌ను తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌ను హుటా హుటిన హైద‌రాబాద్ లోని నిమ్స్ కు త‌ర‌లించారు. కానీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు. ఇవాళ సౌమ్య తుది శ్వాస విడిచారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు పెద్ద ఎత్తున దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం విలువైన ప్రాణం కోల్పోవ‌డం తెలంగాణ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొంది స‌ర్కార్.

Leave A Reply

Your Email Id will not be published!