కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీతో గత 40 ఏళ్లకు పైగా ఉన్న అనుబంధాన్ని ఇవాల్టి నుంచి తెంచుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆవేదన చెందారు. రేవంత్ రెడ్డీ నీ ఆటలు సాగవు గుర్తుంచుకో అని హెచ్చరించారు. ఇదే సమయంలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి వచ్చిన నేతలపై భగ్గుమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఏం ఉద్దరించాడో చెప్పాలన్నారు. వేం నరేందర్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.
తాను పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించు కోలేదన్నారు . జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా పట్టించు కోలేదంటూ సీఎంపై ఫైర్ అయ్యారు. . పార్టీ కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేశారు. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తుతో పోటీ చేసి రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతో కొనసాగుతూ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడమనేది దేనికి సంకేతమని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ సికింద్రాబాద్ సీటును కోల్పోయిందన్నారు జీవన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో పాలమూరులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ఎంతకాలం ఈ అవమానాలు.. ఎంత కాలం ఈ మానసిక క్షోభ.. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకెవడు ఎదగొద్దు. నీ చెప్పు చేతల్లో ఉండేటోడు. నీ దయాదాక్షిణ్యాలకు లొంగేటోడు. నీ అడుగులకు మడుగులొత్తేటోడు.. వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలే. అసవు వేం నరేందర్ రెడ్డి ఎవడు అంటూ ఫైర్ అయ్యారు.
