గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న

మూసీ బాధితుల‌కు అండ‌గా మార్చ్

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న‌కు తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని మండిప‌డ్డారు.

ఈరోజు హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు.

ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని ప్ర‌క‌టించారు. తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా, కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ, బెదిరింపులకు దిగుతూ విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!