న్యూఢిల్లీ : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సమావేశం కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ వన్ గా ఉన్న సంస్థలన్నీ ప్రవాస భారతీయుల ఆధీనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ కు వేదికగా మారింది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. వరల్డ్ వ్యాప్తంగా ప్రముఖులు, దేశాధినేతలు , కార్పొరేట్ ఐటీ దిగ్గజాలు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధానితో పాటు గూగుల్ దిగ్గజం కూడా పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ఏఐ ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఏఐలో భారతదేశం చేస్తున్న పని గురించి , ఈ రంగంలో ప్రతిభావంతులైన విద్యార్థులు , నిపుణులతో గూగుల్ ఎలా పని చేయగలదో వివరించారు పిచాయ్.
ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గూగుల్ దృష్టి, చొరవలను హైలైట్ చేస్తూ కీలక ప్రసంగం చేశారు గూగుల్ సీఈఓ. ఏఐ ఇంపాక్ట్ కోసం ఇండియాకు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ సమ్మిట్ లో 110 కి పైగా దేశాలు, దేశాధినేతలు, మంత్రులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక నాయకులు, స్టార్టప్లు, పరిశోధకులు, పౌర సమాజ ప్రతినిధులు సహా దాదాపు 30 అంతర్జాతీయ సంస్థల నుండి పాల్గొన్నారు. ప్రజలు, గ్రహం, పురోగతి అనే థీమ్ చుట్టూ నిర్వహించబడిన ఈ సమ్మిట్, పాలన, భద్రత ,దాని విస్తృత సామాజిక ప్రభావంపై దృష్టి సారించి కృత్రిమ మేధస్సుపై ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ ఏఐని భారతదేశ ఐటీ రంగానికి అవకాశం కల్పించేదిగా, సవాల్ ను స్వీకరించేదిగా ఉంటుందన్నారు.
