విజయవాడ : ఎంపీ కేశినేని చిన్ని అలియాస్ శివనాథ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలు, ఎత్తుపల్లాలను అతి తక్కువ సమయంలో సరిచేసే సామర్థ్యం ఉండటం ఈ మిషన్ ప్రత్యేకత అని తెలిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో తారు ను అధిక ఉష్ణోగ్రతకు కాల్చి రోడ్డు వేయాల్సి ఉండగా, ఈ ఇన్ఫ్రారెడ్ మిషన్లో అలాంటి కాలుష్యకర ప్రక్రియ అవసరం లేకుండా, పాత తారును అదే ఉష్ణోగ్రతలో రీసైక్లింగ్ చేసి కొత్త తారుతో సమానంగా ఉపయోగించు కోవచ్చని అన్నారు ఎంపీ. దీంతో 98 శాతం వరకు కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం నగరానికి రూ.25 కోట్ల గ్రాంట్ మంజూరైనప్పటికీ, మొత్తం రూ.32 కోట్ల వరకు గ్రాంట్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రూ.32 కోట్ల గ్రాంట్కు అవసరమైన యంత్ర సామగ్రి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు అందుతుందని ఎన్క్యాప్ అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని నగరానికి రావాలని, తద్వారా రోడ్ల పరిస్థితి మెరుగుపడి పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రీన్ డెవలప్మెంట్ మిషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేయడంలో అనుభవం కలిగిన నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసించారు.
