విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి : స్పీక‌ర్

అసెంబ్లీని సంద‌ర్శించిన విద్యార్థులు

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థులు జాబ్స్ తో పాటు రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. బుధ‌వారం ఏపీ శాస‌న స‌భ‌ను సంద‌ర్శించారు స్టూడెంట్స్. భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ పర్యటనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1400 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించడం విశేషం. సభలో ప్రజా సమస్యలపై జరిగే చర్చలను, సభా వ్యవహారాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. సభా విరామ సమయంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఆయన ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులకు త్వరలోనే పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఉద్యోగం చేస్తే కుటుంబానికే పరిమితం అవుతారని, రాజకీయాలలోకి వస్తే ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని వారికి ఉద్బోధించారు. నియోజక వర్గాల వారీగా వచ్చిన విద్యార్థులతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రత్యేకంగా కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, శాసనసభ్యులు బోడె ప్రసాద్, అమ్మిశెట్టి సురేంద్రబాబు, వెనిగండ్ల రాము, సుందరపు విజయ్ కుమార్, బొమ్మిడి నాయకర్, బండారు శ్రావణి, యార్లగడ్డ వెంకట రావు తదితరులు పాల్గొని విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు. చట్టసభల వాతావరణాన్ని నేరుగా చూడటం తమకు ఎంతో జ్ఞానాన్ని, కొత్త స్ఫూర్తిని ఇచ్చిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!