బెంగళూరు : కర్ణాటక హోం శాఖ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్నట్లు భావిస్తున్న 13,675 మంది విదేశీయులను గుర్తించింది. ఇందులో 10,652 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయి. తద్వారా రాష్ట్ర రాజధాని ఈ తరహా కేసుల విషయంలో అత్యధిక సంఖ్యను కలిగి ఉన్న ప్రాంతంగా నిలిచింది. సరైన ప్రయాణ పత్రాలు లేదా వీసాలు లేకుండా భారతదేశంలో ఉంటున్న వారిని, లేదా వలస నిబంధనలను ఉల్లంఘిస్తున్న విదేశీయులను గుర్తించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త తనిఖీ ప్రక్రియలో భాగంగా ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం మైసూరులో 1,155 కేసులు నమోదయ్యాయి; ఆ తర్వాతి స్థానాల్లో మంగళూరు (431), బెళగావి (234), శివమొగ్గ (171) , హుబ్బళ్లి-ధార్వాడ (148) ఉన్నాయి. ఇతర జిల్లాల్లో కూడా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో నివసిస్తున్న విదేశీయులపై పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ తనిఖీ ప్రక్రియ చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని లేదా అనుమతించిన గడువు కంటే ఎక్కువ కాలం ఉంటున్న వారిని గుర్తించి, వారి ఆచూకీ కనుగొనాలని పోలీసులకు సూచించారు. తగిన పరిశీలన అనంతరం, భారత చట్టాల ప్రకారం అవసరమైన చోట దేశ బహిష్కరణతో సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వలస చట్టాల అమలును పర్యవేక్షించేందుకు పోలీసులు, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ , ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ తనిఖీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
