చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ పరాజయం పాలైంది. ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ అగ్ర నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ 234 సీట్లకు గాను 108 సీట్లు సాధించింది. అయితే అధికారం చేపట్టేందుకు ఇంకా ఆయనకు 10 సీట్లు అవసరం అవుతాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుపొందింది. ఈ మేరకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
భారత రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది ఏఐసీసీ. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఆయన జాతీయ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మరో వైపు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఈసారి ఎన్నికల్లో కొలత్తూరులో తన అనుచరుడు, టీవీకే పార్టీ అభ్యర్తి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది ప్రతి ఒక్కరినీ విస్తు పోయేలా చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించ బోమని ప్రకటించారు.
రాజ్యాంగ సంక్షోభం గానీ, మరో ఎన్నిక గానీ డీఎంకే కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనివ్వండి. 6 నెలలు వేచి చూస్తాం అన్నారు. అయితే తాము అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయొద్దని, వాటిని అమలు చేయాలని కోరారు కాబోయే సీఎం టీవీకే విజయ్ ను. విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకం, మహిళల హక్కు నగదు పథకాలు కొనసాగించాలని విన్నవించారు.