అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటు, పర్మిషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్దతులను తప్పించాలని సీఎం సూచించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవిత కాలం చెల్లుబాటు కావాలని స్పష్టం చేశారు. మే నెలాఖరులోగా డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ఆ మేరకు ఆర్డినెన్సులు తీసుకు రావాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకూ మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు. ఫేజ్-2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతులకు, ఏర్పాటుకు ఇప్పుడున్న ప్రక్రియలో 40 శాతం మేర సమయం తగ్గాలని సూచించారు.
పరిశ్రమలకు అనుమతులు, నిబంధనలను సడలించే విషయంలో తమ ప్రతిపాదనల కంటే రాష్ట్రం చాలా ముందుందని ప్రశంసలు కురిపించారు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్. సోమవారం ఆయన తన బృందంతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర బృందానికి వివరించారు సీఎం. ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్టు వెల్లడించారు. డి-రెగ్యులేషన్ ఫేజ్-3ను చేపడుతున్నారా అని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ను అడిగారు. జూన్ నెల నుంచి ఫేజ్-3పై పని చేస్తామని చెప్పారు.
