Anant Singh: జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు
జన్ సురాజ్ కార్యకర్త హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు
Anant Singh : బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్చంద్ యాదవ్ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్చంద్ హత్య కేసులో సీఎం నీతీశ్కుమార్ పార్టీ (జేడీయూ) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ (Anant Singh) ను పోలీసులు అరెస్టు చేశారు. అనంత్ సింగ్ పట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దులార్ చంద్ హత్య నేపథ్యంలో పోలీసులు ఈయనపై నిఘా ఉంచారు. ఇదే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున బార్హ్లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్తో (Anant Singh) పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని విచారించేందుకు పట్నాకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
మొకామా నియోజకవర్గంలో జన్సురాజ్ పార్టీ అభ్యర్థిగా పీయూష్ ప్రియదర్శి ప్రచారం చేస్తుండగా.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే సమయంలో పీయూష్ మామ, పార్టీ కార్యకర్త దులార్ చంద్పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం ప్రకారం బుల్లెట్ తగిలినప్పటికీ.. షాక్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు వెల్లడైంది. హత్య నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆయన మద్దతుదారులు ఆర్జేడీ మొకామా అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వారు. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్ల నివారణలో విఫలమయ్యారన్న కారణంపై పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్ను బదిలీ చేసింది. మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.
Anant Singh – అసలేం జరిగింది ?
గ్యాంగ్స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.
పోస్ట్మార్టం నివేదిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.
రాజకీయ వివాదాలకు కేరాఫ్ అనంత్ సింగ్
అనంత్ సింగ్ (Anant Singh) బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
Also Read : DK Shivakumar: నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే ఆశక్తిర వ్యాఖ్యలు
