హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్లో గాయపడ్డారన్న వార్తలు రావడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. నటుడి నుండి గానీ, చిత్ర బృందం నుండి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆందోళన చెందాల్సినంత తీవ్రమైన సమస్య ఏమీ లేదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బాలకృష్ణ, రామ్ చరణ్, వరుణ్ తేజ్ , రష్మిక మందన్న వంటి పలువురు తెలుగు సినీ తారలు షూటింగ్ సమయంలో చిన్నపాటి గాయాలకు గురయ్యారు. ఆయా సందర్భాల్లో, వారి బృందాలు వెంటనే ఆరోగ్య వివరాలను వెల్లడించడం ద్వారా అభిమానులకు భరోసా కల్పించాయి . అనవసరమైన వదంతులను అరికట్టాయి.
అయితే ఎన్టీఆర్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారిక వైద్య సమాచారం లేక పోవడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలు గానీ, గాయం తాలూకు ఖచ్చితమైన వివరాలు గానీ బహిర్గతం కాక పోవడంతో అభిమానులు సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాలపై అవగాహన ఉన్న వర్గాల సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారని , వైద్య పర్యవేక్షణలో కోలుకుంటున్నారని కూడా సమాచారం.
నటుడి గోప్యతను కాపాడటానికి, కోలుకునే సమయంలో అనవసరమైన దృష్టిని నివారించడానికి ఆసుపత్రి వివరాలను బయట పెట్టకూడదని నిర్ణయించినట్లు కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదే సమయంలో, ‘డ్రాగన్’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక శుభవార్త ఉంది. చిత్ర నిర్మాణ షెడ్యూల్పై దీని ప్రభావం పెద్దగా లేదని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కోలుకోవడంపై దృష్టి సారిస్తుండగా, ఇతర నటీనటులతో కూడిన సన్నివేశాల చిత్రీకరణను బృందం కొనసాగిస్తున్నట్లు సమాచారం. నటుడు పూర్తిగా కోలుకున్న తర్వాత, మిగిలిన సన్నివేశాలను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారని భావిస్తున్నారు. పెండింగ్లో ఉన్న సన్నివేశాలను పూర్తి చేయడానికి సుమారు ఒక నెల రోజుల షూటింగ్ సరిపోతుందని, తద్వారా సినిమా అనుకున్న సమయానికే విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
