Kerala: 136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్’
136 మంది గాయకులతో రికార్డు సృష్టించిన ‘గాతా రహే మేరా దిల్’
Kerala : దాదాపు 136 మంది గాయకులు ఏకధాటిగా 40 గంటలపాటు ప్రముఖ బాలీవుడ్ (Bollywood) సింగర్ కిశోర్ కుమార్కు చెందిన 460 పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. షోడశీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘గాతా రహే మేరా దిల్’ పేరిట కేరళలోని (Kerala) మంగళూరు టౌన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా గతంలో అహ్మదాబాద్ లో 100 మంది సింగర్లు 36 గంటలపాటు కిశోర్ కుమార్ పాటలను పాడిన రికార్డును అధిగమించారు.
ఈ కార్యక్రమాన్ని ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతినిధులు పర్యవేక్షించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 136 మందిని తొమ్మిది బృందాలుగా విభజించి.. ఒక్కోదాంట్లో 8-20 మంది ఉండేలా చూసుకున్నారు. పాట పాటకు మధ్య 59 సెకన్ల విరామానికి అనుమతి ఇచ్చారు. కర్ణాటకకు చెందినవారూ ఇందులో భాగమయ్యారు. ఈ రికార్డు తమకు ఎంతో గర్వకారణమని, కిశోర్ కుమార్కు నివాళి అర్పించినట్లు గాయకులు తెలిపారు.
Kerala – అమ్మ నగల తాకట్టుతో ‘కథక్’ నృత్యంలో గిన్నిస్ బుక్ రికార్డ్
పశ్చిమబెంగాల్కు చెందిన జ్యోతి మొండల్ (30)కు కథక్ నృత్యంలో రికార్డు స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. జిల్లా కేంద్రమైన అలీపుర్ద్వార్ వాసి జ్యోతి మొండల్కు చిన్నప్పటి నుంచీ కథక్ నృత్యమంటే చాలా ఇష్టం. తల్లి బీణా కుమారుడి ఇష్టానికి అండగా నిలిచి ప్రోత్సహించారు. భర్త చనిపోయాక చిన్న దుకాణం నడుపుతూ కుటుంబ బాధ్యతను మోసిన ఆమె తన నగలను తాకట్టు పెట్టి కుమారుణ్ని కథక్ నృత్య తరగతుల్లో చేర్పించారు. గుజరాత్ వంటి దూర ప్రాంతాలకు కూడా పంపారు. కథక్ నృత్యం చేస్తూ 30 సెకన్లలో 68 సార్లు తన చుట్టూ తాను (వృత్తాకారంలో) తిరిగిన ప్రదర్శనకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇటీవల జ్యోతి మొండల్కు ధ్రువపత్రం అందజేశారు. ప్రస్తుతం బిన్నగుడి ఆర్మీ స్కూలులో డ్యాన్స్ టీచరుగా పనిచేస్తున్న జ్యోతి… బిర్పారాలో సొంత నృత్య అకాడమీ నిర్వహిస్తున్నారు. కుమారుడి విజయంపై ఆనంద బాష్పాలు రాల్చిన తల్లి బీణా.. ప్రపంచ రికార్డు సృష్టిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నారు.
Also Read : Sabarimala Gold Case: శబరిమల బంగారం చోరీ కేసులో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు అరెస్ట్
