న్యూఢిల్లీ : పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు వంశీ చందర్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యచరణ, రెండేళ్ల ప్రజా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సాధించిన ఫలితాల పై సుదీర్ఘంగా చర్చించారు ఈ కీలక మీటింగ్ లో. ప్రధానంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతులు సాధిస్తున్న విజయాలు, దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విధానం గురించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు రాహుల్ గాంధీ.
