బెంగళూరు : సీఎం ఎ .రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉన్నత వర్గాల పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి వెళుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల్లలో ఒకటో తరగతి నుంచి మొదలు పెడుతున్నారని అన్నారు. దీన్ని మార్చేందుకు మేం ప్రీ స్కూల్స్ను ప్రవేశ పెడుతున్నాం అన్నారు.. మా దగ్గర 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షలు మంది పిల్లలు ఉన్నారని తెలిపారు సీఎం.. 12 వేల ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 35 లక్షల మంది పిల్లలున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యుత్తమ అర్హతలు ఉన్నవారు… ఎంఏ, పీహెచ్డీ చేసిన వాళ్లు ఉన్నారన్నారు. అయినా ప్రీ స్కూల్ లేకపోవడంతో పిల్లలు రావడం లేదన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది. మేం కూడా ట్రాన్స్పోర్ట్ ఇవ్వడంతో పాటు పిల్లలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం.. మా టీచర్లను సింగపూర్తో పాటు ఇతర దేశాల అధ్యయనానికి పంపించామని చెప్పారు సీఎం.
ఇక గత సర్కార్ పై భగ్గుమన్నారు. 11, 11.50 శాతం వడ్డీ రేటుతో స్వల్ప కాలానికి గతంలో అప్పులు తెచ్చారు. మేం ఇప్పుడు వాటిని 7 నుంచి 8 శాతం వడ్డీరేటుతో పునర్వ్యవస్థీకరిస్తున్నాం.. వాటిని దీర్ఘకాల రుణాలుగా మార్చుతున్నాం.. రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం.. జీఎస్టీలో ఉన్న లోపాలపై కేంద్ర, రాష్ట్రాలు దృష్టి పెట్టడం లేదు. అరవింద్ సుబ్రహ్మణ్యాన్ని జీఎస్టీ సలహాదారుగా నియమించుకున్నాం. గత 7-8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్ల మించి జీఎస్టీ రాబడి లేదన్నారు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం.. ఆరు నెలల్లోనే అదనంగా రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది. పన్నులు పెంచకుండా అవినీతిని, లీకేజీలను అరికట్టడంతో సాధ్యమైందని పేర్కొన్నారు సీఎం.
