హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యన మీడియా తన స్థాయిని దాటి వ్యక్తిగత హననం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆదివారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కొత్త పలుకు పేరుతో తన గురించి ప్రత్యేకంగా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరి ప్రయోజనాలనో కాపాడేందు కోసం తమను ఇరికించే ప్రయత్నం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి కథనంలో తన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారని అందుకే తాను మీ ముందుకు వచ్చానని అన్నారు. తాను రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడినని, ఆయనపై ఉన్న కోపంతో తనను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు భట్టి విక్రమార్క.
సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తి అని, బొగ్గు గనులు అనేవి ఈ ప్రాంతం ఆత్మ అని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తాను ఈ రాష్ట్రానికి చెందిన ఆస్తులను కాపాడటమే తన పని అని స్పష్టం చేశారు. ఆస్తులను సంపాదించడం కోసం, పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు భట్టి విక్రమార్క. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అని అన్నారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చానని కుండ బద్దలు కొట్టారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి తాను పోరాడుతున్నానని ప్రకటించారు. టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ అని తాను కాదని, ఆ విషయం తెలుసుకోకుండా రాధాకృష్ణ కథనం రాయడం విడ్డూరంగా ఉందన్నారు.
