చెలరేగిన సంజు శాంసన్ తలవంచిన ముంబై ఇండియన్స్
103 పరుగుల భారీ తేడాతో ఓటమి ..సీఎస్కే సంచలన రికార్డ్
ముంబై : ఐపీఎల్ 2026లో స్వంత గడ్డపై ఘోరమైన ఓటమిని చవి చూసింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్. లీగ్ మ్యాచ్ లో భాగంగా జరిగిన కీలక పోరులో ఆది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కలిసికట్టుగా ఆడి గెలుపు బాట పట్టింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం తప్పని తేలి పోయింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు సీఎస్కే ఆటగాళ్లు. ఇదిలా ఉండగా ఒకవేళ తాను గనుక టాస్ గెలిచి ఉండి ఉంటే ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినంటూ పేర్కొన్నాడు కెప్టన్ గైక్వాడ్.
మ్యాచ్ లో భాగంగా మైదానంలోకి దిగిన చెన్నై ఆటగాళ్లు మొదటి నుంచి దూకుడుగానే ఆడారు. ఫామ్ లోకి వచ్చాడని అనుకుంటున్న తరుణంలోనే మరోసారి కెప్టెన్ రుతురాజ్ నిరాశ పరిచాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ సైతం స్పీడ్ గా పరుగులు చేసే పనిలో వికెట్ పారేసుకున్నాడు. శివమ్ దూబేను శాంట్నర్ తెలివైన బంతికి పెవిలియన్ పంపాడు. కానీ మరో వైపు యుద్దంలో సైనికుడి లాగా పోరాడాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను కేవలం 54 బంతులు మాత్రమే ఆడాడు. చిరస్మరణమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 10 ఫోర్లు 6 సిక్సర్లు ఉన్నాయి. 101 పరుగులు చేసి చివరి దాకా ఉన్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 207 పరుగులు చేసింది. అనంతరం 208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ లో సూర్య, తిలక్ తప్ప ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. అఖిల్ హుస్సేన్ బౌలింగ్ దెబ్బకు విల విల లాడారు బ్యాటర్లు. దీంతో 104 పరుగులకే చాప చుట్టేశారు. 103 పరుగుల భారీ తేడాతో అద్భుత గెలుపును స్వంతం చేసుకుంది సీఎస్కే.
