హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఏపీలో ఎక్కువకాలం పాటు పని చేసి కేంద్రంలోకి వెళ్లిన సంజయ్ జాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం నియమించింది. తాజాగా మరో అధికారి ఎన్ . శ్రీధర్ ని సీఎంఓలోకి తీసుకు రానున్నారు. తెలంగాణ కేడర్కు చెందిన 1997 బ్యాచ్కి చెందిన విశిష్ట భారతీయ పరిపాలనా సేవా అధికారిగా గుర్తింపు పొందారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా దాదాపు పదేళ్ల పాటు ఉన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు , పంచాయతీ రాజ్ శాఖల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించారు. జూన్ 1, 1971 లో ఎన్. శ్రీధర్ పుట్టారు. విద్య: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ,మాస్టర్ డిగ్రీలు, అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి అప్లైడ్ ఆర్ట్స్ , ఇలస్ట్రేషన్లో డిగ్రీని పొందారు. సివిల్ సర్వీసెస్లో తన సుదీర్ఘ కెరీర్లో శ్రీధర్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ , ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాలలో అనేక కీలక బాధ్యతలను నిర్వహించారు.
అనంతపురం, కృష్ణా, వరంగల్ , రంగారెడ్డి జిల్లాలకు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్గా పనిచేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. 2015 ప్రారంభంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. తన పదవీ కాలంలో కంపెనీని ఆధునీకరించడం, మైనింగ్ కార్యకలాపాలను విస్తరించడం , ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వంలోని ప్రధాన పరిపాలనా విభాగాలలో కీలక పాత్రలు పోషించారు; పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతికత , పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం సీఎంఓలోకి రానున్నారని టాక్.