తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చి ఉత్సవం శ్రీ పద్మావతి ఆలయంలో కొనసాగుతుందని తెలిపింది. 11న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గం.లకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు, వసంతోత్సవం సందర్భంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 29న అంకురార్పణ జరగనుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో 16న ఉత్తరాభద్ర నక్షత్రం సందర్భంగా తిరుచ్చిపై సాయంత్రం 7 గం.లకు స్వామి వారు విహరిస్తారు.శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో 21న రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుందని టీటీడీ పేర్కొంది. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో. 29 తేదీన హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో 04, 11, 18, 25 తేదీలలో శనివారం ఉదయం 8 గం.లకు స్వామివారికి అభిషేకం చేపట్టనున్నట్లు తెలిపింది టీటీడీ. ఇక అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో 07న మంగళ వారం ఉదయం 8 గం.లకు అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించనున్నారు. 10, 17, 24 వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం జరగనుంది. 08న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం. 12న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం జరగనుంది. 05, 12, 19, 26 తేదీలలో శ్రీ ఆంజనేయ స్వామి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ.
