హైదరాబాద్ : శ్రీ పండితారాద్యుల బాల సుబ్రమణ్యం జయంతి ఇవాళ. ఆయన మనల్ని నుంచి దూరమైనా తన పాటల ద్వారా ఇంకా పలకరిస్తూనే ఉన్నారు. మైమరిపించేలా చేస్తూనే వస్తున్నారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక లెజెండరీ వ్యక్తిత్వం, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం జన్మదినం. ఎస్పీబీగా, బాలుగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఈ మహానుభావుడు తన గానంతో భాషలు, సరిహద్దులు దాటి లక్షలాది మంది హృదయాలను ఆకర్షించాడు. ఆయన గాత్రం, నటన, సంగీత దర్శకత్వం, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రతిభ ఈ తరం సంగీత ప్రియులకు ఒక అమూల్యమైన సంపద. 1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్ల, కోనేటమ్మపేటలో జన్మించారు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం. సంగీతం పట్ల చిన్నప్పటి నుండే అపారమైన ఆసక్తిని ప్రదర్శించారు. ఆయన తండ్రి ఎస్. పి. సాంబమూర్తి ఒక హరికథా కళాకారుడు కాగా, తల్లి శకుంతలమ్మ కూడా సంగీతంలో ప్రవేశం కలిగిన వ్యక్తి. ఈ సంగీత వాతావరణంలో పెరిగిన బాల సుబ్రహ్మణ్యం, తనలోని ప్రతిభను గుర్తించి, సినీ సంగీత రంగంలో అడుగుపెట్టారు.
1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో ఆయన సినీ గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎస్. జానకి, పి. సుశీల, వాణీ జయరామ్ వంటి గాయనీమణులతో కలిసి పాడిన డ్యూయట్లు, కె. విశ్వనాథ్, ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్ వంటి దిగ్గజాలతో చేసిన సహకారం ఆయనను దక్షిణ భారత సినిమా సంగీతంలో ఒక శిఖరంగా నిలబెట్టింది.ఎస్పీబీ 16 భాషల్లో సుమారు 40,000 లకు పైగా పాటలు పాడారు, ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఈ రోజు కూడా సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, వెంకటేష్ వంటి నటులకు వారి నటనా శైలికి అనుగుణంగా ఆయన గాత్రం అద్భుతంగా సరిపోయేది. ఆయన పాటల్లో భావం, శైలి, ఉచ్చారణ, మరియు భావోద్వేగం ఒక సమ్మోహన శక్తిని కలిగి ఉండేవి. శంకరా భరణం, సాగర సంగమం, కేలడి కన్మణి, ఏక్ దూజే కేలియే వంటి చిత్రాలలో ఎస్పీబీ పాడిన పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ, ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. కదిలిస్తూనే ఉంటాయి. ఇళయరాజాతో కలిసి ఆయన చేసిన పని తమిళ, తెలుగు సినిమా సంగీతానికి ఒక బంగారు యుగాన్ని తీసుకొచ్చింది.
ఎస్పీబీ కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. పడమటి సంధ్య రాగం, మయూరి వంటి జనాదరణ పొందిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. నటుడిగా కూడా కెలడి కన్మణి, తిరుమళై వంటి తమిళ చిత్రాలతో పాటు తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన మిథునం తెలుగులో నటించి మెప్పించారు. కంటతడి పెట్టించేలా చేశారు ఎస్పీబీ. ఎస్పీబీ టెలివిజన్ రంగంలో కూడా తన ప్రతిభను చాటారు. పాడుతా తీయగా వంటి సంగీత కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా పనిచేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నటులకు తెలుగు వెర్షన్ చిత్రాల్లో గొంతు ఇచ్చారు, ఇది ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం.
ఎస్పీబీ ఆరు జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నారు. 2001లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించగా, 2011లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. 2021లో ఆయనకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రధానం చేసింది కేంద్ర సర్కార్. ఇది ఎస్పీబీ సంగీత రంగానికి అందించిన అపార సేవకు నిదర్శనం. కరోనా కారణంగా దగ్గజ గాయకుడు సెప్టెంబర్ 25, 2020న ఆయన ఈ లోకాన్ని వీడారు. ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
