Telangana Jobs Comment : జాబ్స్ జాడేది నిరుద్యోగులకు దిక్కేది
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఊసే లేని వైనం
Telangana Jobs Comment : నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ తో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది బలిదానాల సాక్షిగా ఏర్పడిన ఈ ప్రాంతం ఇప్పుడు మరోసారి భగ్గుమంటోంది. కారణం కోరి తెచ్చుకున్న కొత్త రాష్ట్రం ఏర్పడి పది ఏళ్లవుతున్నా ఇంకా జాబ్స్ కోసం పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన గులాబీ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగాల భర్తీని పక్కన పెట్టేసింది. కేవలం నోటిఫికేషన్లు జారీ చేయడం, కోర్టులకు ఎక్కడం, చీవాట్లు తినడం షరా మామూలై పోయింది. ప్రస్తుతం ఇది ముచ్చటగా మూడోసారి తెలంగాణలో(Telangana) ఎన్నికలు జరగనున్నాయి. 2018లో కొలువులు భర్తీ చేస్తామంటూ తెలంగాణ సాక్షిగా ప్రకటించారు బీఆర్ఎస్ బాస్. అంతే కాదు జాబ్స్ వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. దీనిని పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో చేర్చారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు.
Telangana Jobs Comment Viral
పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. నిరుద్యోగులకు ఆశలు రేపింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు. పలువురు ఉద్యోగాలు రావేమోనన్న బెంగతో సూసైడ్ కు పాల్పడ్డారు. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ ఏకంగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఏకంగా 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్(KCR) కేవలం లక్షకు పైగా మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. త్వరలోనే నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. వెంట వెంటనే ప్రకటనలు ఇచ్చినా ఫాయిదా లేకుండా పోయింది. ప్రతిపక్షాలు మొత్తుకున్నా, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టినా, నిరసనలు వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. జాబ్స్ పరిస్థితి ఏమిటినే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వక పోవడంపై భగ్గుమంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి , దివాళా తీయించిన బీఆర్ఎస్ సర్కార్ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ త్వరలో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కావడంతో ముందస్తుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేశారు. అన్ని పార్టీల కంటే మిన్నగా ఉంటుందని, నాలుగున్నర కోట్ల ప్రజానీకం సంతోష పడేలా చేస్తామని ఊరించారు. చివరకు కేసీఆర్ ఊసురు మనిపించేలా చేశారు. కేవలం రైతులు, వృద్దులు, మహిళలకు ప్రయారిటీ ఇచ్చారే తప్పా దాదాపు 40 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నా , వారంతా ప్రొఫెషనల్స్ అయినప్పటికీ జాబ్స్ భర్తీ విషయంలో తాత్సారం చేయడం, కావాలని నింపక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇక జాబ్స్ భర్తీని చేసే సంస్థ టీఎస్పీఎస్సీ , ఆయా బోర్డులన్నీ స్కాంలకు కేరాఫ్ గా మారడం తల దించుకునేలా చేసింది. పాలనా పరంగా బాధ్యతలను మరిచి పోవడం, అవినీతి పెచ్చరిల్లడం , రాజకీయ జోక్యం మితిమీరడం తెలంగాణ పాలిట శాపంగా మారింది. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగులు ఎటు వైపు ఉంటారో చూడాలి.
Also Read : MLC Kavitha : కవిత ప్రచార రథం రెడీ
