కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ కి సీబీఐ సమన్లు
ఎన్నికలకు ముందు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ
చెన్నై : తమిళ చలన చిత్ర సీమలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే పార్టీ చీఫ్ తళపతి విజయ్ కి బిగ్ షాక్ తగిలింది. తాను చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనికి ప్రధాన కారకుడు విజయ్ అంటూ డీఎంకే సర్కార్ పేర్కొంది. ఆయన చెప్పిన సమయానికి రాక పోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కి సమన్లు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా టీవీకే పార్టీ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను, సీసీ టీవీ ఫుటేజ్ లను కూడా తీసుకు వెళ్లింది. ఘటనకు సంబంధించి తనను బాధ్యుడిని చేస్తూ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ టీవీకే విజయ్ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరైన భద్రత కల్పించక పోవడం వల్లనే పలువురు ప్రాణాలు కోల్పోయారని, వారికి తాను ముందే ప్రకటించిన విధంగా ఆర్థిక సాయం కూడా చేశానని తెలిపాడు కోర్టుకు. కాగా ఈ ఘటన గత ఏడాది 2025సెప్టెంబర్ 27న కరూర్లో చోటు చేసుకుంది. మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత విషాదకరమైన ఘటనగా దీనిని పేర్కొంది బీజేపీ.
