రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి : డీకే అరుణ
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన పార్లమెంట్ సభ్యురాలు
హైదరాబాద్ : మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం సభ్యురాలు డీకే అరుణ భరత సింహా రెడ్డి మర్యాద పూర్వకంగా సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈసందర్బంగా తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని తర ప్రాంతాలలో రైల్వే శాఖా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు ప్రత్యేకంగా.
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాలలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకు వెళ్లారు ఎంపీ అరుణ. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జి (RUB), రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB)లతో పాటు లిమిటెడ్ హైట్ సబ్ వే (LHS)ల నిర్మాణం కొరకు గతంలో పలు వినతి పత్రాలు అందజేశామన్నారు డీకే అరుణ. వినతిపత్రాలకు సంబంధించిన పురోగతి పై రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
తిమ్మసానిపల్లి, బోయపల్లి, వీరన్నపేటలోని రైల్వే ట్రాక్ లపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, మోతి నగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి ఫిజబులిటీ రిపోర్ట్ పూర్తయిందని, రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపడం జరిగిందని అన్నారు. మార్చ్, ఏప్రిల్ లో ఆ పనులు కూడా సాంక్షన్ అవనున్నట్లు రైల్వే జనరల్ మేనేజర్ ఈసందరర్బంగా ఎంపీ డీకే అరుణకు తెలిపారు. అలాగే దేవరకద్రలో లిమిటెడ్ హైట్ సబ్ వే (LHS) సాంక్షన్ అయ్యిందని, ఫిబ్రవరి చివరి వారంలో టెండర్లను పిలవనున్నట్లు చెప్పారు శ్రీవాత్సవ. TD గుట్టలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) కూడా శాంక్షన్ అయ్యిందని, నిర్మాణ పనులకు ఏప్రిల్ లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
