హైదరాబాద్: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, ఎంపీ పురందేశ్వరి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. లోకేశ్తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు సినీనటుడు కల్యాణ్రామ్ చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్ను పూలతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణించి 30 ఏళ్లు అయినా ఆయన ప్రజల హృదయాల్లో బతికే ఉంటారన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక రకాల పాత్రలు పోశించి అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడి గానూ నటించి మెప్పించారన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరవాత కేవలం అధికారం కోసమే రాజకీయాలు కాదని ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలు అని చాటిచెప్పేలా చేశారన్నారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయన్నారు. కాస్త మార్పులు జరిగినా ఆ పథకాలను ఎవరూ తీసివేయలేదన్నారు. రూపాయికే కిలో బియ్యం, రైతులకు రూ.50కి విద్యుత్, మాండలిక వ్యవస్థ, మహిళలకు చదువు లాంటి పథకాలన్నీ ఎన్టీఆర్ గట్టిగా సంకల్పించి ప్రవేశ పెట్టారన్నారు. ఈ ప్రథకాలు ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు.
