మిగిలిన న‌క్స‌లైట్లు లొంగి పోవాలి : సీఎం

జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వాల‌ని పిలుపు

హైద‌రాబాద్ : స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. మావోయిస్టు నేత గణపతితో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలిన వారుంటే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.మీర్ఖాన్‌పేట భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే, మ‌ల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటినీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతినిధులు కొందరు నా దృష్టికి తెచ్చారని తెలిపారు సీఎం. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ కి పంపించాల‌ని సూచించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అధునాత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం అని అన్నారు.

ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలని అనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్కడ 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం అని చెప్పారు. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడమేంటని, ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం అన్నారు. జూన్ 2 వ తేదీ లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడుతాం అని వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!