అమరావతి : ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి మనోహర్ తో కలిసి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తోందని చెప్పారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు రూ. 439 కోట్లు కేటాయించడం శుభపరిణామం అని అన్నారు. ఈ నిధులను బ్రాండింగ్, ప్రమోషన్, మార్కెటింగ్, ఈవెంట్స్ నిర్వహణకు వినియోగిస్తామన్నారు. ఏపీని ఒక బలమైన టూరిజం బ్రాండ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు కందుల దుర్గేష్.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024-29 నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తీసుకువచ్చి, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన రోడ్షోలు, ఇన్వెస్టర్ సమ్మిట్ల ద్వారా 117 ఎంవోయూలతో రూ. 20,088 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని చెప్పారు కందుల దుర్గేష్. దీని ద్వారా 1,22,637 ఉద్యోగావకాశాలకు మార్గం సుగమమైందని అన్నారు. ప్రస్తుతం రూ. 6,681 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా అమలు దశలో ఉన్నాయన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో 8 ప్రాజెక్టులకు రూ. 428 కోట్ల కేంద్ర గ్రాంట్ లభించిందన్నారు. రాష్ట్రంలో పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక శాఖను కేవలం వినోద రంగంగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి “గ్రోత్ ఇంజిన్”గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. హోటల్స్, రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్లు, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎకో టూరిజం రంగాల్లో విస్తృత అభివృద్ధి చేపడుతున్నామన్నారు.
