విద్యుత్ సంక్షోభం నుంచి నేత‌న్న‌ల‌ను కాపాడాలి

డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్వీ ర‌మ‌ణతో క‌లిసి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను అసెంబ్లీలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నేత‌న్న‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏక‌రువు పెట్టారు. ఈసంద‌ర్బంగా తాజాగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరారు మ‌ల్లు భ‌ట్టిని. ఇదే స‌మ‌యంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావును కూడా ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లిశారు. సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై వివ‌రించారు. ఇందుకు సంబంధించి సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేశారు. వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్, ఎల్వీ ర‌మ‌ణ‌.

గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని ఈ సంద‌ర్భంగా చెప్పారు. ,అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని తెలిపారు. అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందన్నారు.. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూత పడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డార‌ని వాపోయారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి తెలంగాణ నేతన్నలను అదుకోవాలని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!