YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈనెల 4 మంగళవారం నాడు మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. తుపాను కారణంగా తీవ్రంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావంగా ఈ పర్యటన చేస్తున్నారు. పెడన, మచిలీపట్నంలో రైతులను ఆయన పరామర్శిస్తారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలను కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు.
YS Jagan Tour for Montha Cyclone Efected Region
ఇటీవల మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు, గాలులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైయస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన, రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేశారు. ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలను చేకూర్చారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదు. దాదాపు రూ.600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని పెండింగ్ లో పెట్టారు. ఆర్బీకేలను, ఈ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు.
ఇవన్నీ కూడా రైతులకు పెనుశాపంగా మారిన నేపథ్యంలో తాజాగా వచ్చిన మోంథా తుపాను కూడా రైతుల నడ్డి విరిచింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ, కార్యాచరణ గానీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా శ్రీ వైయస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించనున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి తద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు పేర్ని నాని, తలశిల రఘురాం వెల్లడించారు.
Also Read : ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్
