తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. వాయిదా వేయడం కూడా సబబేనని కోర్టు అభిప్రాయపడింది. టీఎస్పీఎస్సీలో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.
ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దానిని విచారిస్తున్న సిట్ అధికారిపైనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. రాష్ట్ర సర్కార్ సపోర్ట్ వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని ఇక సిట్ ఎలా సమర్థవంతంగా, పారదర్శకంగా విచారణ చేపడుతుందని అనుమానం వ్యక్తం చేశారు.
అందుకే తాము సిట్ కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామని విన్నవించారు. విచారణ పూర్తిగా విన్న ధర్మాసనం కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే రోజు అంతిమ తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, కొందరు మాత్రం దీని ద్వారా లబ్ది పొందారని వాపోయారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఇలాంటి స్కామ్ లో చోటు చేసుకున్న పలు రాష్ట్రాలు సిట్ కు కాకుండా సీబీఐకి అప్పగించాయని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి కాంగ్రెస్ తరపు న్యాయవాది తెలిపారు.
