RS Praveen Kumar Comment : అతడే సారథి ఆర్ఎస్పీ వారధి
తెలంగాణలో బీఎస్పీ జోష్
RS Praveen Kumar Comment : రాష్ట్రంలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. మాటలతో మంటలు రేపుతూ నాయకులు జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జంపింగ్ జపాంగ్ ల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సమీకరణలు, కులాల లెక్కలు ఉండాల్సిందే. ఎవరి కులానికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో తూకం వేసే పనిలో పడ్డాయి పార్టీలు. ప్రతి పార్టీ తామే పవర్ లోకి వస్తామని అంటున్నాయి. కానీ ప్రధాన పార్టీల కంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కువగా లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఎందుకంటే వారు నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. వారి తరపున వాయిస్ వినిపిస్తున్నారు. షర్మిలను పక్కన పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తెలంగాణలో సెంటర్ పాయింట్ గా మారారు. ఉమ్మడి పాలమూరు జిల్లా శక్తిపీఠం కొలువు తీరిన జోగులాంబ అమ్మ వారి ప్రాంతం ఆలంపూర్ కు చెందిన వ్యక్తి. కడు పేదరికం కుటుంబం నుంచి వచ్చిన ఆర్ఎస్పీ కష్టపడి చదువుకున్నాడు.
కులం కట్టుబాట్లను, వివక్షను దగ్గరుండి చూశాడు. ఐపీఎస్ గా ఎంపికై పలు పోస్టులలో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాల సంస్థకు సెక్రటరీగా ఉన్నారు. పెను మార్పులు తీసుకు వచ్చారు. ఆ తర్వాత బహుజనులకు , సంబండ వర్ణాలకు న్యాయం జరగడం లేదని భావించారు. ఆపై విమర్శలు, ఆరోపణలు , దూషణలు ఎదుర్కొన్నారు. భద్రమైన ఉద్యోగం ఉన్నా ఎందుకనో ముందస్తుగానే తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇతర పార్టీలలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన బహుజనులకు వాయిస్ గా ఉన్న బీఎస్పీలో చేరారు. ఆర్ఎస్పీ(RSP) చేరాక ఆ పార్టీ రూపు రేఖలు మారి పోయాయి. ప్రధానంగా సమస్యలను, రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అరాచక పాలనను ప్రశ్నిస్తూ వస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం అందడం లేదని గొంతెత్తి నినదిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీపై ఆర్ఎస్పీ(RSP) వాయిస్ మరింత పెంచారు. చివరకు సిట్ వేసేలా చేశారు.
ప్రస్తుతం పల్లెలపై ఫోకస్ పెట్టారు. పట్టణాల్లో సైతం బీఎస్పీని విస్తరించే పనిలో పడ్డారు. మొత్తానికి బీఎస్పీకి తనే సారథిగా మారారు. పాదయాత్రలు, సభలు, సమావేశాలు, సదస్సులలో పాల్గొంటూ బిజీగా మారి పోయారు. మరో వైపు అణగారిన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి కూడా ప్రజల కోసం ఉద్యమ బాట పట్టారు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో బహుజనులంతా ఏకం కావాలని, విలువైన ఓటును పని చేసే వారికి పట్టం కట్టాలని కోరుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RSP). నోట్లకు అమ్ముడు పోవద్దని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరవద్దని కోరుతున్నారు. రాజ్యాంగమే లేక పోతే నిమ్న కులాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఆర్ఎస్పీ(RSP) ఇప్పుడు ప్రధాన స్రవంతిలో అందివచ్చిన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు. ఒక రకంగా జనాభా పరంగా నిమ్న, పేద, బడుగు, బలహీన వర్గాలు అత్యధిక ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో మాత్రం వాటా దక్కడం లేదు. దీంతో మా కోటా మా వాటా కావాలనే నినాదం ఇప్పుడు ఊపందుకుంది. మొత్తంగా ఆర్ఎస్పీ ఇప్పుడు ఒక్కడే ఆశా దీపంగా కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందనేది రాబోయే కాలమే చెప్పాలి.
Also Read : RS Praveen Kumar : బీఎస్పీ విజయం చారిత్రక అవసరం
