Raghunandan Rao Comment : కాకా రేపుతున్న ‘దుబ్బాక’
ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలకం
Raghunandan Rao Comment : అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు పొందిన భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో షాక్ తగిలింది. అది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) రూపంలో. ధిక్కార స్వరాన్ని వినిపించడం విస్తు పోయేలా చేసింది పార్టీ శ్రేణులను. బీజేపీకి వాయిస్ గా ఉంటూ వచ్చారు రఘునందన్ రావు. గత కొంత కాలంగా ఆయన మిన్నకుండి పోవడం మరింత అనుమానాలకు తావిచ్చింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి మరికొందరు నేతలు సైతం అసమ్మతి స్వరం వినిపించడం ఒకింత అసహనానికి గురి చేసింది. పార్టీకి మాస్ ఇమేజ్ తీసుకు వచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై నేరుగా ఆరోపణలు చేయడం ఆసక్తిని రేపింది. రాష్ట్రంలో పార్టీలు ఎన్ని ఉన్నా ఒకే ఒక్కడుగా ఉంటూ వచ్చారు. తనదైన శైలిలో స్పందిస్తూ అధికార పార్టీని అడుగడుగునా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు రఘునందన్ రావు(Raghunandan Rao). న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఆపై ప్రశ్నలు కురిపించడం ఆయనకు మాత్రమే చెల్లుబాటు అవుతుందనేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు.
బీజేపీ హై కమాండ్ ను కాదని ఏ ఒక్కరు కూడా బయట పడే ఛాన్స్ లేదు. కానీ ఉన్నట్టుండి రఘునందన్ రావు సంచలన విమర్శలు చేయడం సీనియర్లను సైతం విస్తు పోయేలా చేసింది. ఆయన ప్రధానంగా బండికి ఆ రూ.100 కోట్లు ఎక్కడివి అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు పుస్తెలు అమ్మి కౌన్సిలర్ గా బరిలోకి దిగిన బండి సంజయ్ కు అన్ని కోట్లతో యాడ్స్ ఇచ్చే స్థితికి ఎలా చేరారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో తాను 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేశానని అన్నారు. ఆపై పార్టీ చీఫ్ , ఫ్లోర్ లీడర్ , జాతీయ అధికార ప్రతినిధి పోస్టులలో తనకు ఒకటి అప్పగించాలని డిమాండ్ చేశారు. పార్టీకి డెడ్ లైన్ ప్రకటించారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. ఆపై పార్టీ ఫ్లోర్ లీడర్ ను ఎందుకు నియమించలేదనే విషయం తెలియక పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఏకంగా నడ్డాపై కూడా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు రఘునందన్ రావు(Raghunandan Rao). బీజేపీ వల్లనో లేదా పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ వల్ల ఓట్లు పడవన్నారు. తనను, ఈటల రాజేందర్ ను చూసి ప్రజలు ఓట్లు వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చానని కానీ ఇప్పటి వరకు పార్టీ పరంగా తనకు గుర్తింపు రాలేదని వాపోయారు. దుబ్బాకలో పోటీ చేసిన తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను గెలుపొందాకే బీజేపీకి రాష్ట్రంలో బూస్ట్ వచ్చిందని ప్రకటించారు. మొత్తంగా దుబ్బాక ఎమ్మెల్యే రేపిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది బీజేపీనే. మరి నడ్డా ఏమంటారో చూడాలి. చివరకు రఘునందన్ రావు సైలెంట్ అవుతారా లేక సైడ్ అయి పోతారా అన్నది వేచి చూడాలి.
Also Read : President Murmu : ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం