Chatra Sthapana Narayanagiri : ఘనంగా ఛత్రస్థాపన ఉత్సవం
శ్రీవారి పాదాల వద్ద ఘనంగా పూజలు
Chatra Sthapana Narayanagiri : తిరుమలలో కొలువైన శ్రీనివాసుడి పాదాల వద్ద ఛత్రస్థాపన ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా టీటీడీ(TTD) అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల నుంచి అర్చక బృందం మేదర మిట్టకు చేరుకుంది. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. తొలుత శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించారు.
Chatra Sthapana Narayanagiri Program
స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం శ్రీనివాసుడికి అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమొర చేపట్టారు. పూజాది కార్యక్రమం పూర్తయిన అనంతరం భక్త బాంధవులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇక స్థల పురాణం పరంగా చూస్తే తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన స్థితిలో నారాయణ గిరి శిఖరం కొలువై ఉంది. కలియుగంలో శ్రీనివాసుడు మొదట కాలు మోపినట్లు ప్రతీతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి కావడంతో స్వామి వారికి ఛత్రస్థాపన ఉత్సవం చేపట్టారు. ఉత్సవ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏటి గోవిందరాజ దీక్షితులు, అర్చకులు ఎ. గోవిందాచార్యులు, ఏఎస్ కృష్ణ చంద్ర దీక్షితులు పాల్గొన్నారు.
Also Read : Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన 85 వేల భక్తులు
