Air India: డ్రీమ్‌ లైనర్‌ విమానాల్లో తనిఖీలు ప్రారంభించిన ఎయిరిండియా

డ్రీమ్‌ లైనర్‌ విమానాల్లో తనిఖీలు ప్రారంభించిన ఎయిరిండియా

Air India : ఎయిరిండియా వద్దనున్న బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (DGCA) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానాల్లో తనిఖీలు ప్రారంభించింది. తమ వద్ద ఉన్న 33 ‘బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌’ విమానాల్లో తొమ్మిదింటిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. మిగిలిన 24 డ్రీమ్‌లైనర్‌ల తనిఖీలు త్వరలోనే పూర్తిచేయనున్నట్లు తెలిపింది.

Air India Launch

‘‘డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్‌-టైమ్‌ భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిరిండియా (Air India) కొనసాగిస్తోంది. బోయింగ్‌ 787 విమానాలు భారత్‌ కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటికే తొమ్మిది విమానాలకు పూర్తిచేయగా… మరో 24 విమానాలకు గడువులోగా పూర్తిచేస్తాం. ఈ తనిఖీల్లో కొన్నింటికి అధిక సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావచ్చు. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. ఎయిర్‌ పోర్టుకు వెళ్లేముందు విమానాల స్టేటస్‌ను ముందుగానే చెక్‌ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నాం’’ అని తాజా ప్రకటనలో ఎయిరిండియా పేర్కొంది.

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) దగ్గరున్న బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలకు సంబంధించి వివిధ వ్యవస్థల పనితీరును తనిఖీ చేయడంతోపాటు, గాల్లోకి ఎగిరే అంశానికి (టేకాఫ్‌) సంబంధించిన పరామితులను పరిశీలించాలని డీజీసీఏ తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిరిండియా దగ్గర బోయింగ్‌ 787-8 విమానాలు 26, బోయింగ్‌ 787-9 విమానాలు ఏడు ఉన్నాయి.

అంతర్గత ఆడిట్‌ నిర్వహణకు ఎయిరిండియా బోర్డు ఆదేశం

అహ్మాదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై యావత్‌ ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎయిరిండియా బోర్డు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అంతర్గత ఆడిట్‌ నిర్వహించాలని ఎయిరిండియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విమానాల కండీషన్‌, వాటి నిర్వహణ పద్ధతులు, ఇలా వివిధ శాఖలపై సమీక్ష కూడా చేయించడంపై ఎయిరిండియా ఛైర్మన్‌, సీఈవో సిద్ధమయ్యారు. భద్రతా ఆడిట్‌ నిర్వహణకు ఎయిరిండియా బోర్డును ఆదేశించారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటనపై మరో విచారణ చేపట్టనుంది. ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం, వారిని సమగ్ర శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి పెట్టింది.

విమాన ప్రమాదంపై అన్ని దర్యాప్తు సంస్థలకు సహకరిస్తామని ఎయిరిండియా పేర్కొంది. కాగా.. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం ఇటీవల కూలిపోయిన సంగతి తెలిసిందే. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 274 మంది మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదంపై స్వయంగా దర్యాప్తు చేపట్టేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర తనిఖీలు చేపడుతోంది.

Also Read : Shubhanshu Shukla: జూన్‌ 19న అంతరిక్ష యాత్రకు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

Leave A Reply

Your Email Id will not be published!