అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని, ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని చెప్పారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్. ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పబ్లిసిటీ సెల్ నందు స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్విని తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ జగ్గన్నతోటలో ప్రతి సంవత్సరం కనుమ రోజున ఘనంగా నిర్వహించే, 400 సంవత్సరాల ప్రాచీన సంప్రదాయ పండుగ ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు కేబినెట్ ఆమోదం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కందుల దుర్గేష్. ఇది కోనసీమ సంస్కృతికి, తెలుగువారి సంప్రదాయాలకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
జాతీయ స్థాయిలో ఇప్పటికే గుర్తింపు పొందిన ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, సహకరించిన సహచర మంత్రులకకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు కందుల దుర్గేష్. ఈ నిర్ణయం సంప్రదాయాల సంరక్షణకు, సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి, ప్రాంతీయ సమానత్వ సాధనకు దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంతంలోని 11 పురాతన శైవ ఆలయాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించబడే ఈ ప్రభల తీర్థానికి ప్రతి ఏటా సుమారు 6 లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారని చెప్పారు కందుల దుర్గేష్. ప్రభల ఊరేగింపు, కౌశికా నదిని దాటే విశిష్ట ఆచారం ఈ పండుగను రాష్ట్రానికి చెందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వంగా నిలబెడుతున్నాయని తెలిపారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు, కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు ఈ పండుగ ప్రత్యేకతకు నిదర్శనం. రాష్ట్ర పండుగ హోదాతో ప్రభల తీర్థాన్ని భవిష్యత్ తరాల కోసం మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసి, కోనసీమను అధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ముందు కెళ్తామని ప్రకటించారు.
