రాబోయే కాలంలో బీఆర్ఎస్ దే రాజ్యం : కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ ఫెయిల్ అయ్యింద‌ని ఫైర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియదని, తాను కూడా గెలుస్తానో లేదో తెలియదు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అదిలాబాద్ లో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పాడ‌ని గుర్తు చేశారు. కృష్ణారావును ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు అందరికీ తెలుసని, కానీ ఆయ‌న తిన్నంటి వాసాలు లెక్క బెడుతూ ప‌ద‌వి కోసం ఇత‌ర పార్టీలోకి జంప్ అయ్యాడ‌ని ఆరోపించారు కేటీఆర్. అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు.

తన మంత్రి పదవి కాపాడు కోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడని ఎద్దేవా చేశారు కేటీఆర్. అవకాశవాదంతో కాంగ్రెస్ లోకి పోయిన నాయకుడు జూపల్లి కృష్ణారావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో.. ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు కేటీఆర్. ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ.. హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ.. చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఆరోపించారు. ఇక ఆ పార్టీని జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!