హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత రూటు మార్చింది. ఇక అన్నింటిని తెగ తెంపులు చేసుకుని ముందుకు కదలాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ పరంగా తనకు లభించిన అరుదైన అవకాశం ఎమ్మెల్సీ పదవిని వదులుకుంది. ఈ మేరకు రాజీనామా చేయడం, దానిని మండలి చైర్మన్ గుత్తా ఆమోదించడం జరిగింది. ఈ సందర్బంగా శాసన మండలిలో తను చాలా సేపు మాట్లాడింది. ఆపై కన్నీళ్లు కార్చింది. చివరకు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఏం పికింది అంటూ ఎద్దేవా చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా కుటుంబం, వ్యక్తిగత సమస్యలను ఎలా ప్రస్తావిస్తారని, అసలు చైర్మన్ కు సోయి అనేది ఉందా అంటూ ప్రశ్నించారు తెలంగాణ మేధావులు. ఈ తరుణంలో బయటకు వచ్చిన కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీగా మార్చే పనిలో పడింది. ఇందు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే పనిలో పడింది.
ఇందు కోసం ఏకంగా 32 కమిటీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రోడ్మ్యాప్ను సిద్ధం చేసే బాధ్యత అప్పగించబడిన ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను అధ్యయనం చేయడానికి వీటిని ఏర్పాటు చేశామన్నారు. అన్ని పార్టీల రాజ్యాంగాలను అధ్యయనం చేయడానికి అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు కవిత. ఈ కమిటీలు నీరు, నిధులు, నియామకాలతో సహా 32 అంశాలపై కూడా అధ్యయనం చేస్తాయన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీకి ఈ నెల 17వ తేదీలోగా క్షేత్రస్థాయి అధ్యయనాలు నిర్వహించి నివేదికలను సమర్పించాలని ఆమె కమిటీ సభ్యులను ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, తదుపరి నిర్ణయాలు తీసుకోవడానికి జాగృతి రాష్ట్ర స్థాయి కార్యనిర్వాహక కమిటీ సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు.
