రాధాకృష్ణ ‘రాతల’పై విచారణ జరిపించే దమ్ముందా ..?
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన దేశిపతి శ్రీనివాస్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ప్రత్యేక కథనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్టీవీలో వచ్చిన కథనం ఆధారంగా సిట్ వేశారని, ఆ తర్వాత అన్యాయంగా యూట్యూట్, ఛానల్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారని , అకారణంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. మరి ఇప్పుడు సాక్షాత్తు మీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాధాకృష్ణ రాతలపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు చేశారని అన్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై, ఆంధ్రజ్యోతి కథనాలపై ‘సిట్’ విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఎలా అయితే నియమించారో అదే విధంగా ఈరోజు వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై కూడా తక్షణమే సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వేమూరి రాధాకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆయన పుట్టినరోజున స్వయంగా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపే ముఖ్యమంత్రి.. వార్త రాసే ముందు తనను వివరణ అడగాలి అని మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు దేశిపతి శ్రీనివాస్ . ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని అన్నారు. చట్టప్రకారం దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
